2029 ఎన్నికల్లో పోటీ చేస్తాం: కవిత

  • జాగృతిని రాజకీయ పార్టీగా మార్చే దిశగా సంకేతాలు
  • గ్రామస్థాయిలో జాగృతి కమిటీలు ఏర్పాటు చేస్తామన్న కవిత
  • కొత్త పార్టీ పేరుపై నెటిజన్ ప్రశ్నకు ఆసక్తికర సమాధానం
జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత తన రాజకీయ భవిష్యత్తుపై కీలక ప్రకటన చేశారు. 2029లో జరిగే ఎన్నికల్లో తాను కచ్చితంగా పోటీ చేయనున్నట్లు స్పష్టం చేశారు. ఎక్స్ వేదికగా ఆమె నెటిజన్లతో 'ఆస్క్ కవిత' పేరుతో క్వశ్చన్ అవర్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నెటిజన్లు అడిగిన పలు ప్రశ్నలకు ఓపికగా సమాధానాలిచ్చారు.

ఈ సందర్భంగా ఓ నెటిజన్.. "మీ కొత్త పార్టీ పేరు ఏంటి?" అని ప్రశ్నించగా, "ఎలా ఉండాలో మీరే చెప్పండి" అంటూ కవిత సమాధానమిచ్చారు. ఈ వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో ఆసక్తిని రేకెత్తించాయి. త్వరలోనే జాగృతి సంస్థ కార్యకలాపాలను గ్రామస్థాయి వరకు విస్తరిస్తామని, ప్రతి గ్రామంలో కమిటీలను ఏర్పాటు చేస్తామని ఆమె తెలిపారు. జాగృతి సంస్థ ద్వారానే ఎన్నికల బరిలో నిలవబోతున్నట్లు పరోక్షంగా సంకేతాలు ఇచ్చారు.

2047 నాటికి దేశ ప్రజలందరికీ నాణ్యమైన ఉచిత విద్య, వైద్యం అందించడమే తన జీవిత లక్ష్యమని కవిత పునరుద్ఘాటించారు. ఇదే తన విజన్, మిషన్ అని ఆమె పేర్కొన్నారు. కవిత తాజా ప్రకటనతో ఆమె భవిష్యత్ రాజకీయ ప్రణాళికలపై చర్చ మొదలైంది.

Kavitha
Kalvakuntla Kavitha
2029 Elections
Jagruthi
Telangana Politics
BRS
Free Education
Free Healthcare
Ask Kavitha
Political Future

More Telugu News